రచన: మంగు కృష్ణకుమారి
మన కవులు కవయిత్రులు అందరూ, వాళ్లు మనో దృష్టితో తిలకించిన దానిని పద్యంగా రచించేరు.
రామాయాణాన్ని తెనింగించిన , కవయిత్రి మొల్ల వనవాసానికి వెళ్లే రాముడిని, గుహుడు గంగ దాటించడానికి ముందు సన్నివేశాన్ని ఎలా చెప్పేరో చూడండి.
“సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ నొక కాంత యయ్యెనట, పన్నుగ నీతని పాదరేణువీ యడవడిన్ ఓడ సోక, ఇది ఏమగునోయని సంశయాత్ముడై కడిగె గుహుండు రామ పద కంజ యుగంబు భయమ్ము పెంపునన్”
ఈ పద్యపు భావాన్ని, మన కొసరాజు గారు తేట తెనుగులో పాటలా చేసి సంపూర్ణ రామాయణం సినిమా కోసం రాసిన “రామయ్య తండ్రీ, ఓ రామయ్య తండ్రీ! మము దయ చూడ వచ్చావు రామయ్య తండ్రీ” పాటలో ఓచరణం ఇలా రాసేరు:
“ఆఁ ఆగు బాబూ, ఆగు!
అయ్యా నే వత్తుండా, బాబూ నే వత్తుండా,
నీ కాలి దుమ్ముసోకి రాయి ఆడది అయినాదంట,
నా నావమీద కాలు పెడితె ఏమౌతాదో తంటా…
దయ చూపి ఒక్కసారి కాళ్ళు కడగనీమంటా
మూడుమూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట
రామయ తండ్రీ, ఓ రామయ తండ్రీ!
ఈ పాటని ఘంటసాల గారు కమ్మటి కంఠంతో పాడేరు.
మొల్లగారి పద్యం చదివి, ఈ పాట విన్నవాళ్ళ కళ్ళు చెవులూ, పావనం అవాల్సిందే.
***