రచన: ప్రొ. రామా చంద్రమౌళి
డిసెంబర్ నెల. రెండవ ఆదివారం. విపరీతమైన చలి. పొద్దెక్కి ఎనిమిది గంటలౌతున్నా. అంతా పొగమంచే చిక్కగా. మనిషికి ఎదుటనున్న మనిషే కనబడ్తలేడు.
‘గీ వరంగల్ ల గింత పొగమంచు ఎన్నడూ లేదు. ఎవరో నగరమంతా దట్టంగా పొగను చిమ్మినట్టు. ఏందో’ అనుకుంది ఇరవై నాలుగేళ్ల నిర్మల.
ఎల్లంబజార్ మాంసపు బజార్ ల. వెనుక వరుసగా కాపుడు కొట్లు. ఒకటే జనం హడావిడి. వరుసగా బజ్ జ్ జ్ జ్ మని అరుస్తున్న బ్లోయర్ల చప్పుడుతో జీవధ్వని. గాలినిండా చర్మం కాలుతున్నప్పటి కమురు వాసన గాఢంగా. మార్కెట్ లోపలికి అడుగుపెట్టగానే రెండు వైపులా వరుసగా మాంసపు దుకాన్లు. ఇంకాస్త పదడుగులు నడిస్తే రెండు వైపులా అరుగులపై కూర్చుని కూరగాయలు అమ్మే ఆడవాళ్ళు. ఎక్కువగా ముసలోల్లే. ఇంకాస్త పదడుగులేస్తే. చేపల లక్ష్మి. వరుసగా చేపల డ్రమ్ములు. గంపల్లో జిలజిలా మెసుల్తూ చేపలు. ఆమె ఎప్పుడూ బొమ్మె చేపల్నే అమ్ముతది. గత ముప్పై ఏండ్లకు పైగా ఆమే అక్కడ చేపల అమ్మకానికి సర్వాధికారిణి. హోల్ సేల్. మరియు రిటైల్. పక్కా తూకం. పక్కా రేట్ కు పేరు మోసిందామె. ఆమె చుట్టూ చేపలను అప్పటికప్పుడే చంపి, మన ముందే శుభ్రం చేసి, కోసి ముక్కలు చేసి కడిగి ఇచ్చే నలుగురైదుగురు నడీడు స్త్రీలు. చుట్టూ తమ వంతు చేపలను కడిగించుకుని వెళ్లేందుకు ఎదురుచూస్తూ నిలబడ్డ కస్టమర్ జనం.
ఆ చేపల అడ్డా దాటితే. వెనుక వరుసగా మేకల, పొట్టేళ్ళ తలకాయలనూ, కాళ్ళనూ కాపి, నీటితో కడిగి ఇచ్చే ఆరేడు కొట్లు పొగ చూరి, ఎప్పుడో ప్రభుత్వం వేయించిన నాసిరకం టైల్స్ పగిలి ఊడిపోయి. పెచ్చులు పెచ్చులుగా చెదిరిపోయి. కొన్ని బొగ్గులు. కుప్పలు కుప్పలుగా కట్టె ముక్కలు, పెద్ద పెద్ద ప్లాస్టిక్ గంగాళాల్లో నల్లని మసి నీళ్ళతో. అంతా పొగ. ధూళి. కమురు వాసన. ప్రతి కొట్టు ముందూ కస్టమర్లు తమ కాళ్ళు, తలకాయల కోసం ఎదురు చూస్తూ. ‘ఇంకెప్పుడమ్మా తొందరగా కానీ’ అని తొందర. గద్దింపులు. ప్రతి కొట్టు మీదా ఇద్దరు వ్యక్తులు. ఒకరు వచ్చిన గిరాకీ నుండి పచ్చి కాళ్ళు, తలకాయలను తీసుకుని వరుసలో పెట్టడానికి. మరో వ్యక్తి బట్టీ ముందు తపస్సులో ఉన్న ఋషిలా బ్లోయర్ ను ఒడుపుగా తిప్పుతూ సన్నని మంటమీద అటో రెండు కాళ్ళూ. ఇటు మధ్యలో ఒక తలకాయను పెట్టి. అటు ఇటు మంటల మధ్య సర్దుతూ…
అంతా ఒక సంరంభం. హడావిడిగా అటు ఇటూ నడుస్తూ వస్తూ వెళ్లే మనుషులతో ఒక జీవన వ్యాపారం.
ఆ మూలకున్న చివరి కొట్టులో. నిర్మల తదేకంగా చూస్తోంది బజ్ జ్ జ్ మని శబ్దిస్తున్న ఎర్రని మంటలోకి.
చిన్నప్పటినుండి. ఏడో తరగతిలో ఈ ఎల్లంబజార్ కు తల్లి జమీలా బాయ్ వెంట తీసుకుని వచ్చింది మొదలు. కొత్తదనంతో, చిన్నపిల్ల చేష్టలతో ‘‘అమ్మీ నేను బ్లోయర్ ను తిప్పుతనే. కాల్చిన కాళ్ళను కత్తితోటి గీకుతనే . మై సాఫ్ కరూంగీ ’’ అని మారాం చేసి గిరాకీ కటికోల్ల దగ్గర బేరమాడి చేతులతోటి తీసుకొచ్చుకున్న ఒక మొండీ చార్ పైర్. చటుక్కున వాళ్ళ చేతులనుండి లాక్కుని,
‘‘అన్నా అన్నా. మై కరూగీ జల్దీ ఔర్ బెహ్తర్ ’’ అని అరుస్తూ తల్లి దగ్గరకొచ్చి ఇచ్చి, నవ్వు ముఖం మీద
‘చూడు నేను గిరాకీని పట్టుకొచ్చిన’ అని.
అప్పుడు మొదలైన ఎర్రని నాలుకలను చిమ్ముతూ కాల్చే మంటలోకి చూచే అలవాటు. మంట కాలుస్తుంది. మాడుస్తుంది. బుగ్గి చేసి బూడిదను మిగులుస్తుంది. అంతిమంగా ఏమీ మిగలకుండా నిశ్శేషం చేస్తుంది.
మంట. బయటి మంట. లోపలి మంట. వయసు గడుస్తున్నకొద్దీ నిర్మలకు అర్థమైంది బయటి మంటకంటే లోపలి తీవ్రమైన మంటే అతి శక్తివంతమైనదని.
ఇటు అమ్మి జమీలా బాయ్. అటు నోటినిండా జర్దా పాన్ నముల్తూ ముఖం నిండా మంటల నీడలు పారాడ్తూండగా తపస్సులో నిమగ్నమై ఉండే యోగిలా. మన లోకంలోనే లేని ఋషిలా. బాపు కటికె దయానంద్. ఏండ్ల పర్యంతం బ్లోయర్ తిప్పుతూ తిప్పుతూ . గిరాకీ తెచ్చే పొట్టేల్ తలకాయల ముక్కు రంధ్రాల్లో ఒడుపుగా ఇనుప కడ్డీలను లోతుగా గుచ్చి దిగేసి . దాన్ని చేతితో చురుగ్గా మంటల్లో మాడుస్తూ. మరో చేత్తో బ్లోయర్ హాండిల్ ను ఆగకుండా తిప్పుతూ. దాంట్లో ఎంతో నైపుణ్యం దాగి ఉంది. మంట సన్నగా నిలకడగా రావాలె. జ్వాల తెగకూడదు. వేడి స్థిరంగా తాకాలె మొండికీ, పైర్ కూ.
ఇదొక రకమైన వృత్తి. కటికోల్లు సాధారణంగా మేకలనూ, పొట్టేళ్ళనూ కోసి. చర్మాలనూ, మాంసాన్నీ అమ్ము కుని దాంతో జీవిస్తారు. అదే కుల వృత్తి. ఇక దాంట్లో కస్టమర్లను మోసం చేయడాలు. జోకుడులో దండీ కొట్టడాలు. ఆడమేకలను కోసి మేకపోతులని దబాయించడాలు. కల్తీ మాంసం. బాట్లల్ల చీటింగ్ . మరో దిక్కు మున్సిపాలిటీ వాళ్ళకు, పోలీసులకు, సానిటరీ ఇన్ స్పెక్టర్లకు. తూనికలు కొలతలోల్లకు మామూళ్ళు. లంచాలు నజ్ రానాలు. ఎన్నో తతంగాలు.
చిన్నప్పటినుండి అనుభవాలన్నీ వెరసి ‘బతకడం అంత సుళువేమీ కాదు’ అని చెప్పిన పాఠం.
నిర్మల ప్రక్కనే ఉన్న తన స్మార్ట్ మొబైల్ ను తాకింది చేతితో. తెరపై టైం ప్రత్యక్షమైంది. ఏడూ యాభై నిముషాలు.
‘టచ్ స్క్రీన్. టచ్ స్కిన్. ’ నవ్వుకుంది నిర్మల.
తల్లి జమీలాబాయికి కేన్సర్. కొలోన్ కేన్సర్ అని రెండు నెలలక్రితమే తేలింది. ఫోర్త్ స్టేజ్ అన్నడు డాక్టర్. కష్టమే అని తాత్పర్యం. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స. ఇక్కడ లోకల్ దవాఖాన. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి. హైదరాబాద్ కు. యశోద సికింద్రాబాద్ బ్రాంచ్ల. ఆంకాలజీ ఫ్లోర్. ఎందరు కేన్సర్ రోగులో. వందలమంది. ఆరోగ్యశ్రీ అనేది ఒక అంతులేని నిరంతర దోపిడీ పథకం. ప్రజలు ఎంత బాగుపడ్తున్నారోగాని. దవాఖాన్లూ డాక్టర్లు మాత్రం అతి పచ్చగా విలసిల్లుతున్నారు.
అమ్మ చనిపోవడం ఖాయం అని తేలిపోయింది. కాని మనిషిని చివరి శ్వాసవరకు పీల్చి పిప్పిచేస్తూ డబ్బు దండు కోవాలెగదా ఆరోగ్యశ్రీ కింద. అదే జరుగుతోంది. కెమో థెరపీ. రేడియేషన్. సకల పరీక్షలు. స్కానింగ్ లు.
అందువల్ల ఈ మూడు నెలలుగా. ప్రతి ఆదివారం. పండుగరోజులు. గిరాకీ ఎక్కువగా ఉంటుందనుకున్న రోజుల్లో, నిర్మల చేస్తోంది ఎల్లంబజార్ దుకాణం డ్యూటీ. తలకాయలు, కాళ్ళు కాపుడు. షాప్ నడుపుడు. ఇంటి సభ్యులు. నాయిన దయానంద్. అమ్మమ్మ ఈశ్వరమ్మ, తమ్ముడు కిషన్. అందరిలోనూ గడ్డకట్టిన దుఃఖమే. ‘అమ్మ చచ్చిపోతుంది త్వరలో ’. అనేది బహిరంగ రహస్యమైపోయింది ఇంట్లో.
‘చదువుకో బిడ్డా. మా లెక్క ఈ మొండీ, పైర్ కాపుడు. కాల్చుడు వద్దు బిడ్డా ’ అని. తలకాయ కాళ్ళు కాపుతే అరవై రూపాయలు ఇప్పుడు. పది రూపాయలనుండి చూస్తోంది నిర్మల.
చదువు. చదువు. ఇంజనీరింగ్. బి. టెక్ కంప్యూటర్ సైన్స్. తర్వాత గేట్. పి. జి. సెట్. ఎం. టెక్. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లన్నీ. ఒట్టి బూటకం. అంతా ఫీజ్ రీ-ఎంబర్స్ మెంట్ వ్యాపారం. కాలేజ్ కు రాని స్టూడెంట్స్. దొంగలెక్కల అటెండెన్స్. యూనివర్సిటీలతో కుమ్మక్కు. బి. సి. ఎస్. సి, ఎస్. టీ డిపార్ట్ మెంట్స్ తో అవగాహన. అన్నీ పర్సెంటేజ్ లు. కోట్లకు కోట్లు ప్రజాధనం మిస్ యూజ్. స్టాఫ్ నాసిరకం. వాళ్ళవి ఫేక్ డిగ్రీలు. ఫేక్ పి. హెచ్ డి లు. ఫేక్ తనిఖీలు. విద్యార్థులకు ‘ బయో మెట్రిక్ ’ మషీన్స్ పెడితే క్లోనింగ్ ఫింగర్ ప్రింట్స్ తయారు చేసుకుని వాటిని ప్రతిరోజూ ఉపయోగిస్తూ. మేనేజ్ మెంట్స్ చీటింగ్.
ఈ దేశం నరనరాన అవినీతి. చదువురాని వాళ్ళకంటే. బాగా చదువుకున్న విద్యావంతులచేతనే భయంకరమైన దోపిడి. అన్ని రంగాల్లో. .
ఎట్లా. ఎట్లా. ఈ దోపిడీ వ్యవస్థను ఎట్లా ప్రక్షాళన చేయాలె. రాజకీయ నాయకుల్లో అవినీతి. ప్రతివాడు కోతుల కంటే హీనంగా గోడలు దూకుతూ పార్టీలను మార్చడమే. రాష్ట్రమేదైనా నీచ రాజకీయాల్తో బహిరంగంగానే శాసన సభ్యులతో క్యాంప్ లు నిర్వహిస్తూ ‘జస్ట్ పర్చేజ్’ . యువత క్రికెట్ మానియా. ఇంటర్ నెట్ పిచ్చి. బూతు సినిమాల వ్యసనం. ఒక్క మొబైల్ తెరిస్తే సకల పోర్నో బరితెగింతలు. విచ్చలవిడి సెక్స్. హింస. వావి వరుసలులేని అరాచకాలు. ప్రభుత్వాధికారుల అంతులేని దోపిడి. ప్రతివాడూ లగ్జరీ జీవితాన్ని స్వప్నించేవాడే. క్విక్ మనీ. క్విక్ గ్రోత్. ఓవర్ నైట్. కోటీశ్వరుడు కావాలన్న దురాశ. ప్రభుత్వాలన్నీ ఒట్టి ప్రేక్షకపాత్ర. వాళ్ళకు అధికారమే పరమావధి.
‘‘అమ్మా వీటిని కాపుతవా’’ అని గొంతొకటి. పరిచయమున్న కంఠం. ఎక్కడనో ఇదివరకు విన్నట్టు.
తలెత్తింది నిర్మల. కలెక్టర్ జయరాముడు ఎదురుగా. తెలుసామెకు. కాని నిర్మల తెలియదు కలెక్టర్ కు. అతి సాధారణంగా. జనంలో కలిసిపోయి. అతి నిరాడంబర జీవితాన్ని గడపడంలో పరమానందాన్ని పొందే ‘ మోస్ట్ సింపుల్ హ్యూమన్ బీయింగ్ ’ జయరాముడు.
అతని చేతిలో కొమ్ములు తిరిగిన ఒక పొట్టేల్ తలకాయ, నాలుగు బలిష్టమైన కాళ్ళు ఉన్నై. చటుక్కున అందుకుంది నిర్మల.
‘‘థాంక్యూ. ఎంతసేపైద్దమ్మా ’’
‘‘ఒక్క పావుగంట సర్. ’’
అప్పటిదాకా దట్టంగా అలుముకుని ఉన్న పొగమంచు కొద్దికొద్దిగా పల్చబడి విచ్చుకుంటోంది.
అనేక సందర్భాల్లో. తెలంగాణ మలి ఉద్యమకాలంలో. అనేక ధర్నాలు, రైల్ రోకోలు. బంద్ లు, ప్రతిఘటనలు. అన్నింటిలోనూ. అధికారిక ప్రతిస్పందనల్లోనూ నిర్మల గమనించింది జయరాముడు గారిని. ఆసక్తికరమైన అతని నిరాడంబర సమర్థతను గురించి విన్న నిర్మల ఎన్నోసార్లు ‘ ఈ దేశంలో ఇటువంటి అధికారులు ఒక్క యాభైశాతం మంది ఉన్నా ఎంతబాగుండును ’ అనుకుంది.
‘‘బాపూ. ఈ సార్ వి తొందరగా చేయవే ’’ అని పొటేల్ తల ముక్కులోకి ఒక ఇనుప రాడ్ ను గబగబా గుచ్చి ముందున్న కర్రమొద్దుపై బలంగా గుద్ది. తండ్రికి అందించింది.
అతను దాన్ని సర్ది. బ్లోయర్ మంటను కొద్దిగా పెంచి. నోట్లోని జర్దా పాన్ ను దవడ మార్చుకున్నాడు. బ్లోయర్ ద్వని లయాత్మకంగా వినవస్తూనే ఉంది.
పొగమంచు దాదాపు తగ్గిపోయి. మబ్బులను చీల్చుకుని వస్తున్న సూర్యుని కిరణాలు పడ్తూండగా. ఆ పరిసరమంతా బంగరురంగుతో మెరుస్తోంది. పాపం సూర్యునికేమిటి తేడా. అది కబేళా ఐనా. కనకదుర్గమైనా. అవే స్వర్ణ కిరణాలు. అదే దయ మానవాళిపై.
జయరాముడు. ఆ పొగచూరిన, మసిపట్టిన ఇరుకు దుకాణంలోకి అలా అలవోకగా చూస్తూ ఉండిపోయాడు పరిసరాలను గమనిస్తూ.
ఆశ్చర్యపోయాడు. ఎదురుగా గోడకు ఉన్న ఒక చెక్క ర్యాక్ లో కొన్ని పుస్తకాలున్నాయి. ఒకటి గతరాత్రే అతను చదివిన ‘సేపియన్స్ ’ పుస్తకం. యువల్ నోప్ హరారీ రాసిన ‘మానవజాతి సంగ్రహ చరిత్ర’. ఇంకొకటి. డేనియల్ గోల్మన్ రాసిన ఆసక్తికర పుస్తకం ‘ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ ’ . అటుప్రక్కనేమో బాగా పాతగా. పొగచూరినట్టున్న అట్టలతో ‘ భగవద్గీత. టీకా తాత్పర్యం’ . అక్షరాలు మాసిపోయినై.
‘మీ నాయిన ఆ భగవద్గీతను చదువుతడా’
‘అదే ఆయనను బతికించేది. ఒక వేయిసార్లు చదువచ్చు’
జయరాముడు చటుక్కున ఒకరకమైన మైకంలో ఉన్న మనిషిలా బ్లోయర్ ను తిప్పుతూ మంటలోకి తదేకంగా చూస్తున్న దయానంద్ వైపు చూశాడు.
‘జ్ఞానదాహం. ఎవరి సొత్తు ’ . వాల్మీకి జ్ఞాపకమొచ్చాడతనికి ఎందుకో.
సరిగా ఆ క్షణమే జయరామునికి కొన్ని జ్ఞాపకాలు కురుస్తున్న చినుకుల్లా మదిలో వర్షించాయి.
ఆ రోజు. జె ఎన్ టి యు. హైదరాబాద్. స్టూడెంట్స్ ఫీడ్ బ్యాక్ మీటింగ్ లో. ఇదే నిర్మల. చాలా ధైర్యంగా. శాస్త్రీయంగా మాట్లాడింది. ‘ మీరు ఇంజనీరింగ్ కాలేజీల చేతుల్లో తొత్తులు సార్. ఇన్స్పెక్షన్ కు వస్తున్నట్టు రెండ్రోజుల ముందు చెప్పి వస్తే. ఆ గ్యాప్ లో వాళ్ళు సర్దుకుని అన్నీ మీ ముందు చూపిస్తారు. స్టాఫ్ ను కూలికి పట్టుకొచ్చి ముందు నిలబెడ్తరు. సడెన్ గా చేయండి తనిఖీలను. అప్పుడు బయటపడ్తుంది బండారం. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ ల పేరుతో దేనికీ పనికిరాని మానవ చెత్తను తయారు చేస్తున్నారు లక్షలకొద్దీ ’ గడగడా చెప్పుకుపోయింది వందల నిజాలను. లోపాలను.
అది పూర్తిగా నిజం.
తెలంగాణా ఉద్యమంలో ఎన్నోసార్లు పోలీసుల లాఠీ దెబ్బలుతిని. ఈ నిర్మల అరెస్ట్ ఐ లాకప్ కావడం తెలుసు జయరాముడుకు.
ఒక రోజు ఒక వందమంది యువతీయువకులను వెంట తీసుకుని వచ్చింది ఈ నిర్మల కలెక్టరేట్ కు. కనీసం ఒక అరగంట సమయం కావాలని ముందే అడిగి తీసుకుని వచ్చింది. ఒక ఐదుగురు సభ్యులను అనుమతించాడు లోపలికి జయరాముడు.
నిర్మల సంఘం పేరు ‘ DOG ’
‘‘చెప్పమ్మా.’’ అని ప్రశాంతంగా అడిగినప్పుడు ఆమె చెప్పిన పరిష్కారాలను విని ఆశ్చర్యపోయాడు తను.
‘‘సార్. ఈ దేశం మొత్తం నీతినియమాలు లేని దుష్ట రాజకీయ నాయకుల చేతుల్లోనూ, తెరవెనుక ఉండి శాసించే కాంట్రాక్టర్ల చేతుల్లోనూ పూర్తిగా బందీ ఐ ఉంది సార్. ప్రతిపనినీ తమ కాంట్రాక్టర్లకు ఇచ్చి కమీషన్లు దండుకునే వాళ్ళు రాజకీయ నాయకులైతే. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లతో పాటు. రోడ్లనూ, భవనాలనూ, ఫ్యాక్టరీలనూ, ప్రజలకవసరమైన సకల సదుపాయాలనూ సమకూర్చే వ్యవస్థలన్నీ ఈ కాంట్రాక్టర్ల చేతుల్లోనే కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళు కమీషన్లు చెల్లిస్తూ. నాసిరకపు పనులతో మమ అనిపిస్తూ. దేశాన్ని దోపీడీ చేస్తూనే ప్రజలకు భద్రత లేకుండా చేస్తూ. ఒక భూమిపుండువంటి సమాజాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని చెక్ చేసే వ్యవస్థే పూర్తిగా కరువైంది. ఇప్పుడు మీవంటి అధికారి సహకరిస్తే. యువకులుగా మేము ఈ కేన్సర్ లాంటి అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం సర్. డాగ్ అంటే కుక్క సార్. DOG అన్న ఈ మూడక్షరాలను తిరగేస్తే. అది GOG గాడ్ ఔతుంది సర్. మీకు ఒక DOG విశ్వశ్రీ గురించి చెబుతాం సర్. మాది లక్ష్మీపురం ఏరియా. మా దగ్గర ఆరు ప్రాజెక్ట్ లు నడుస్తున్నాయి. ఒకటి మూడు కిలొమీటర్ల రోడ్దు. దాని ఎస్టిమేషన్ పదిహేను కోట్లు. ట్వంటీఫైవ్ పర్సంట్ ఎక్సెస్. తెలుసు మాకు. పని నాసిరకంగా జరుగుతుంది. ఇప్పుడు . మేము ప్రతిదినం ఒక బ్యాచ్ వెనుక బ్యాచ్. కాంట్రాక్టర్ నిర్మించవలసిన రోడ్దు ప్రమాణాలను ఆ పని పూర్తయే వరకు ప్రతిరోజూ చెక్ చేస్తాం. భారత పౌరులుగా మాకు ఆ హక్కు ఉంది. అటు ప్రక్కన ఒక ఫ్లై ఓవర్ కడుతున్నారు. దాని విలువ పన్నెండు కోట్లు. మనం మౌనంగా ఉంటే. అది వాడు కట్టిన నాలుగు నెలలకే కూలిపోతుంది. మేము మా ‘ డాగ్ ’ సంఘం లో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్స్ తో టైం టు టైం చెక్ చేయిస్తాం ప్రమాణాలను. అట్లాగే ఒక చెరువు. పదికోట్లతో. దాన్నీ ఫార్స్ గానే చేస్తారు. మేము దాన్నికూడా కాపలా కుక్కలా అడుగడుగూ చెక్ చేస్తూ. మా ప్రజాధనాన్ని కాపాడుకుంటాం. ఐతే. ఈ మా ప్రవేశంతో మీకు రాజకీయ ప్రతిఘటన ఎదురౌతుంది. మీరు. ఒక ఆదర్శవాదిగా. సామాజిక స్పృహ ఉన్న అధికారిగా. మాకు మీ చేయూతనివ్వండి చాలు. గీకిన అగ్గిపుల్లలా మేము ఎట్లా విజృంభించి ఈ వ్యవస్థకు అగ్నిచికిత్సను చేస్తామో చూడండి. . ’’ అట్లా గుక్క తిప్పుకోకుండా అరగంట చెప్పుకుపోయింది నిర్మల ఆ రోజు.
జయరాముడు ఉబ్బితబ్బిభై పొంగిపోయాడు. తను ఊహిస్తున్న కొత్త యువతరం ‘ డాగ్ ’ పేరుతో సర్వైలెన్స్ వ్యవస్థగా ఆవిర్భవించినందుకు.
ఆ నిర్మల. ఈ నిర్మలేనా? ఒట్టి శుద్ధమైన, సారవంతమైన బురదలోనుండి. ఎర్రని సూర్యకాంతితో కమలం వికసిస్తోందా. అపరబ్రహ్మలా . కొత్త సృష్టి ఈ యువతితో ఆరంభమౌతుందా.
ఏమో. ఈ శాస్త్రీయ అవగాహనతో గనుక అడుగు ముందుకు వేస్తే. మార్పు అనేది సంభవమేకదా.
జయరాముడు నిర్మల ముఖంలోకి ఆశగా చూస్తూనే ఉండిపోయాడు. బురదలోనుండి పుట్టిన కమలమే గదా బ్రహ్మపీఠం.
ఆమె వెనుక ‘ ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్ ’ పుస్తకం కనబడుతోందతనికి. అటువేపు భగవద్గీతను ఆపోశనపట్టిన దయానంద్ రగులుతున్న నిప్పుల్లోనుండి వెలువడ్తున్న సన్నని మంటలోకి చూస్తున్నాడు యోగిలా.
ఉదయం నుండి దట్టంగా ఉన్న పొగమంచు ఎప్పుడో కరిగి విడిపోయింది.
*****