రచన : ఎ.జె. సావిత్రీ మౌళి
అంతశ్శత్రువులను అణచి, ఆదర్శాలకు విలువనిచ్చి, ధార్మిక జీవనాన్ని గడిపిన మహానుభావులు ఎందరో వున్నారు. అందుకు ఆడ, మగ తేడా లేదు. ప్రతిభ దైవ దత్తం. ప్రతిభకి స్త్రీ , పురుష బేధం లేదు. ప్రతిభావంతులు అన్ని దేశాలలో, అన్ని రంగాలలో, అన్ని కాలాల్లో వున్నారు. వేదాంత విద్యలో కూడా ప్రవీణులయిన బ్రహ్మవాదినులు వున్నారు. భారతీయులకు పరమ పవిత్రమైనది వేదం. అందులో మంత్రద్రష్టలయిన మహిళలున్నారు. వారిని ఋషీకలు అంటారు. ప్రాచీనకాలంనాటి రోమశ, ఛోష, విశ్వవర, ఇంద్రణి, శచి మొదలయిన శ్లోక రచయిత్రులు, ప్రతిభావంతులు..వారితో సాటిరాదగ్గ సాధ్వి గార్గి.
వచక్ను మహర్షి గారాలపట్టి గార్గి. తండ్రికి తన పుత్రిక వాగ్మిగా, విదుషీమణిగా, వివేకవతిగా, విశిష్ట వ్యక్తిగా రాణించాలని ఆకాంక్ష. అలాగే తన భావాలకు, అభిరుచులకు తగిన విధంగా ఆమెని పెంచాడు. తండ్రి ప్రోత్సాహం, ఆశ్రమ వాతావరణ ప్రభావం గార్గిలో ఆత్మ స్ధైర్యాన్ని పెంచింది. ఆశ్రమంలో వున్నవారివలన ఆధ్యాత్మిక విద్యయందు ఆసక్తి, మునుల దీవెనలవలన మోక్ష జిజ్ఞాస ఆమెకు కలిగించాయి. బ్రహ్మచారిణులతో సహవాసం పరమనిష్టకు సోపానమయింది. ఆమె సౌజన్యం, దీక్షకి తపోధనులు సంతసించారు. గార్గి వాదబలానికి తోటివారు నిరుత్తరులవగా, ఆమె వైదుష్యానికి సహపాఠకులు తలలు దించారు. క్రమంగా ఆమె కీర్తి ఆశ్రమం దాటి, ముని పల్లెల్లో ధ్వనించి, నగర పొలిమేరల్లో తచ్చాడి, కోట గోడల్లో విహరించి, కొలువుకూటం వరకూ ప్రాకింది. రాజస్ధానాల్లో మన్ననలు అందుకుంది. గార్గి ప్రతిభ రాణించే రోజు వచ్చింది.
ఒకసారి మిధిలా నగరంలో జనక చక్రవర్తి సభ జరుగుతోంది. ధర్మజ్ఞులు, వేదాంతులు, నీతికోవిదులు, సకల కళాపారంగతులు, సర్వవిద్యావిశారదులు, పౌరాణికులు, లాక్షణికులు, తపోవరిష్టులు, కర్మనిష్టులు, ఋత్విక్కులతో సభ కిటకిటలాడుతోంది. కరవాలంతో కాక కనికరంతో, హింసలు, వంచనలు లేకుండా, హితబోధలతో శాసించి, పాలించే రాజర్షి ఆయన. జనకుని సంపద అంతా దానాలకే పరిమితం. ఆధ్యాత్మిక రహస్యాల శ్రవణమే ఆయన ప్రవృత్తి. తన కొలువుకి వచ్చేవారిని నిశితంగా పరిశీలించేవాడు ఆయన. జనకుడు ఒక యాగం చేశాడు. ఆ యాగానికి కురు పాంచాల దేశాలనుంచి వేద పండితులు వచ్చారు. వేద తత్వం తెలిసినవారు వీరిలో ఎవరు – అని జనకునికి సందేహం వచ్చింది. సభలోని పండితులలోన బ్రహ్మవేత్తని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. ఈ పరీక్ష పండితుల మధ్య తేలవలసిన అంశం అనుకున్నాడు ఆయన.
సమృధ్ధిగా పాలిచ్చే వెయ్యి గోవులను విశాలమైన మైదానంలో, స్వర్ణాభరణాలు, కొమ్ములకు ధనసంచులతో, అలంకరించి వుంచాడు. ఇంది ఎందుకో ఎవరికీ అర్ధం కాలేదు. దానాలు యిస్తారని పేద బ్రాహ్మణులూ, విశిష్టయాగం కోసం అని హోతలూ, ఉత్తములని సత్కరిస్తారని సామాన్యులూ అనుకున్నారు. సభలో శాకల్యుడు, భుజ్యువు, విదగ్ధుడు మరియు యాజ్ఞవల్క్యుడు వున్నారు. వారిని వుద్దేశించి జనకుడు – “మహాత్ములారా ఇది సభాంగణమే కాదు, సద్విషయ చర్చాంగణం, సత్యశీలుర ప్రాంగణం. మీలో బ్రహ్మవేత్తలయినవారికి సభకి వెలుపల మైదానంలోని వేయి గోవులను అర్పిస్తాను” – అన్నాడు. సభలో కలకలం ప్రారంభమైంది. భుజ్యుడు తలవంచగా, అహోబలుడు దిక్కులు చూడగా, శాకల్యుడు సభని పరిశీలించాడు. సాహసం చేయడానికి ఎవరూ సిధ్ధం కాలేదు. జనకునికి యాజ్ఞవల్క్యునిపై దృష్టి ఆనింది. ఆశ్వలుని వైపు చూపు పారింది. ఇప్పటిదాకా ఆలోచనలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుని చూచాడు. అతని ముఖం చంద్రునిలా ప్రకాశిస్తోంది. అతను వేదంలో సామభాగాన్ని సలక్షణంగా అధ్యయనం చేశాడు.
యాజ్ఞవల్క్యుడు జనకునితో, “నేను బ్రహ్మవేత్తను. ఆధ్యాత్మవిద్యా విశారదుణ్ణి. కాబట్టి ఈ వేయి గోవులని నా ఆశ్రమానికి తరలించడానికి నా శిష్యుడికి అనుమతి ఇవ్వండి” – అని గంభీరంగా అన్నాడు. జనకుడు మౌనంగా వున్నాడు. మౌనం అంగీకారం అనుకుని సామశ్రవుడు గోవులని తరలించడానికి సిధ్ధమవుతుంటే అశ్వలుడు – “యాజ్ఞవల్క్యా, ఉత్తముడవని నీవే ప్రకటించుకోవటం అన్యాయం. విద్వాంసుడవయితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పు” అనగా “నేను సిధ్ధం” – అన్నాడు యాజ్ఞవల్క్యుడు. బ్రహ్మతత్వం అనగా ఏమిటి అని అశ్వలుడు అనగా – నాకు తెలియదు. నేను బీద బ్రాహ్మడిని. నాకు గోవులు అవసరం – అని వ్యంగంగా అన్నాడు మహర్షి. తదుపరి కొన్ని ప్రశ్నలు అశ్వలుడడుగగా చక్కని సమాధానాలు చెప్పాడు మహర్షి. ఇంకా అడిగే ధైర్యంలేక వెనకడుగు వేశాడు అశ్వలుడు. ఇంతలో మహిళామణులవైపు అందరిచూపులు మళ్ళాయి. అక్కడ వున్న స్త్రీలలో ఆర్షవిద్యాస్వరూపిణి, సరస్వతీ సారూప్యము, వేదమాతగా భావించే నారీ కూర్చుని వుంది. ఆమెయే గార్గి. ఆధ్యాత్మిక విద్యా రహస్యం తెలిసిన అద్వితీయ సాధ్వీ శిరోమణి. ఆమె యాజ్ఞవల్క్యుని తపశ్శక్తిని మెచ్చింది. బ్రహ్మ స్వరూపం తెలిసినవాడైన బ్రాహ్మణుడు, ఎదుటివారి సందేహాలు తీర్చగలిగేవాడే పండితుడు, అనుకొని లేచి నిలబడి, జనకునితో – “మహారాజా, నేను గార్గిని. ఆధ్యాత్మిక అంశాలపై నాకు కొన్ని సందేహాలున్నవి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అనుమతిస్తే యాజ్ఞవల్క్యులవారిని అడుగుతాను” అనెను. అంతే…సభలో అలజడి ఎవరూ ఊహించని సన్నివేశం. స్త్రీలకు అమిత సంతోషంగావుంది.
జనక చక్రవర్తి గార్గిని, మహర్షిని చూచి – “మహర్షీ, ఇది విద్వత్సభ. సరస్వతి విద్యాస్వరూపిణి. ఇచ్చట ఎవరయినా, ఏదయినా అడగవచ్చు. సందేహాలు తీర్చుకోవచ్చు” అనగా, యాజ్ఞవల్క్యుడు సరే అన్నాడు.
గార్గి మహాత్మా ఈ జగత్తులోని వస్తుజాలానికి ఆధారభూతం ఏది అనగా, ఆకాశం అన్నాడు మహర్షి. తదుపరి ప్రశ్నల పరంపర ఈ క్రింది విధంగా వుంది.
ప్రశ్న అకాశం అనే పదార్ధం ఎక్కడ వుంది
జవాబు గంధర్వలోకంలో
ప్ర గంధర్వలోకం ఎక్కడవుంది
జ సూర్యలోకంలో
ప్ర సూర్యలోకం ఎక్కడ వుంది
జ చంద్రమండలంలో
ప్ర చంద్రమండలం ఎక్కడ
జ నక్షత్రమండలంలో
ప్ర నక్షత్రమండలం ఎక్కడ
జ దేవలోకంలో
ప్ర దేవలోకం ఎక్కడవుంది
జ ఇంద్రలోకంలో
ప్ర మరి ఇంద్రలోకం ఎక్కడ
జ ప్రజాపతి రాజ్యం
ప్ర ప్రజాపతి రాజ్యం ఎక్కడ
జ బ్రహ్మలోకంలో
ప్ర బ్రహ్మలోకం ఎక్కడ స్ధిరంగా అడిగింది గార్గి. మహర్షి చికాకుచెంది, “గార్గీ చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకు. సమయం వ్యర్ధం. ఇలా అడుగుతూవుంటే తలపగిలి నేల పడుతుంది” అన్నాడు.
ఇదంతా గమనించిన జనకుడు, గార్గితో, “గార్గీ, ప్రస్తుతాంశం బ్రహ్మవేత్త ఎవరి అనేది నిష్కర్ష. సంబంధిత ఒకటి, రెండు ప్రశ్నలకి అనుమతి ఇస్తున్నాను” అన్నాడు. గార్గి తలవూపింది. రెండు ప్రశ్నలలో మొదటిది – ఆకాశానికి పైన వున్నది, భూమికి క్రింద వున్నదీ, భూమ్యాకాశాల మధ్యన వున్నదీ ఏమిటి వివరించండి అన్నది. సభలో జిజ్ఞాస పెరిగింది. మహర్షి విషయం గ్రహించి – “గార్గీ, ఆకాశం ఒకటే సర్వవ్యాపకం. భూత, వర్తమాన, భవిష్యత్తులో కూడా నిరంతరం వుడే తత్వం ఆకాశం ఒక్కటే” – అన్నాడు. మరో ప్రశ్న – భూత భవిష్యద్వర్తమానాలకు గుర్తులేవి – అని ఆమె అడుగగా – అదే పరబ్రహ్మం. అది చిన్నదీ – పెద్దదీ కాదు. పొడుగూ – పొట్టీ కాదు. రంగులూ, రుచులూ, వాసనలూ లేవు. కళ్ళకు కనబడదు. ఎవరూ భుజించలేరు. అగ్నిలా అరుణిమకాదు. జలంలా తరళంకాదు. ఛాయా – తిమిరాలు లేవు. ఆ శక్తే సూర్య – చంద్రుల్ని నడిపిస్తుంది. అదే అక్షర బ్రహ్మ. ఈ బ్రహ్మయే కాలాన్ని నడిపించటం, భూమ్యకాశాల్ని క్రమ పధ్ధతిలో తిరిగేలా చేయటం, దివారాత్రాలు, వారాలు, మాసాలు, ఋతువులు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాల్ని ఏర్పరుస్తున్నది. ఈ అగోచర శక్తి చేతనే నదులు, సముద్రంలో కొన్ని ఒక వైపునుండి, మరికొన్ని మరో వైపునుండి సాగరంలో కలుస్తున్నవి. ఈ అక్షర బ్రహ్మ కనబడదు, కానీ అన్నీ చూస్తుంది. వినబడదు, కాని అన్నీ వింటుంది. తానెవర్కీ తెలియదు, తనకు అన్నీ తెలుసు. అది అక్షయం, అనంతం, చిరంజీవి, మహా శక్తి సంపన్నం – అని యాజ్ఞవల్క్యుడు సృష్టి రహస్యం చెప్పాడు. ఈ సమాధానంతో గార్గి సంతృప్తిపడి, తన సందేహాలు తీరినట్లు తెలిపి, మహర్షి బ్రహ్మవిదులలో ఉత్తముడని, బ్రహ్మను తెలుసుకున్నవాడని నమ్మింది. సభమహర్షికి జేజేలు పలికింది. జనకుడు ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసినందుకు ఆనందించాడు. వేయి గోవులు యాజ్ఞవల్క్యునికి ఇవ్వబడినవి.
గార్గి పేరు దశదిశలా వ్యాపించింది. విదుషీమణి అయింది ఆమె. గార్గి మేధస్సును పండితులు ప్రశంసించారు. వాదబలానికి బ్రహ్మచారిణిగా జీవించాలనుకుంది ఆమె. కుమార్తె నిర్ణయం తండ్రికి నచ్చలేదు. ఆమె విద్యావతి కావాలనుకున్నాడు, కాని అవివాహితగా వుండటం బాధ కలిగింది. ఎన్నోసార్లు నచ్చచెప్పాడు. కాని ఫలితం శూన్యం. గార్గి బాల్యం ఎపుడో గడిచిపోయింది. యవ్వనం జారిపోతోంది. వృధ్ధాప్యం స్వాగతం పలుకుతోంది. కాని ఇవేమీ పట్టించుకోకుండా సన్యాస దీక్షతో, ధ్యానంతో, కాలం గడుపుతూ వుంది ఆమె. ఒకనాడు నారదుడు రాగా, అతిధి సత్కారాలు చేసిన గార్గిని చూసి, అమ్మా, జీవితం క్షణ భంగురం. వయోదారుఢ్యం నిలువదు. సుఖ భోగాలు జీవికి అవసరం. ఈ నియతి అందరికీ సమానం. అందుచేత వివాహం చేసుకోమ్మా – అన్నాడు. అందుకు గార్గి మహర్షీ, స్త్రీ – పురుషులకు భిన్న భిన్న ఆచారాలు లేవు. సాంసారిక జీవితం గడపకుండా సన్యాసులయిన వారెందరో వున్నారు. అలాగే నేనూ సన్యాసినిని. ధ్యానంతో ముక్తి పొందాలని నా ప్రగాఢ వాంఛ అని నారదుడితో అనగా, అమ్మా, నీ ఆలోచన బాగుంది. కాని పురుష ధర్మాలు వేరు, స్త్రీ ధర్మాలు వేరు. వివాహిత కాని స్త్రీ దేహం అపవిత్రం. వారికి మోక్ష ప్రాప్తి లేదు అని నిక్కచ్చిగా నారదుడు చెప్పాడు.
సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన సత్పురుషుడు, ధర్మోపదేశం చేసే దేవర్షి మాటలతో గార్గి తనలో తాను వితర్కించుకుంది. తాను కోరేది ముక్తి. ఆ ముక్తి అవివాహితులకి లభ్యం కాదు అంటున్నారు. కాబట్టి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు శృంగవంతుడనే ముని తగినవాడు అనుకున్నది. ఆయన గార్గిని వివాహం చేసుకునేందుకు అభ్యతరం చెప్పలేదు. ఆయనతో గార్గి, మహర్షీ, నేను నారదోపదేశానుసారం, ముక్తి కొరకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు సంసారంపై రక్తి, కుటుంబ జీవితంపై అనురక్తిలేదు. మన వైవాహిక జీవితం ఒక్కరోజు మాత్రమే. అందుకు సమ్మతిస్తే నిన్ను పెళ్ళాడుతా అన్నది. ఒక్క రోజుకోసం పెళ్ళాడి, తదుపరి శాశ్వతంగా ఏకాకిగా జీవించడానికి శృంగవంతుడు అంగీకరించలేదు. అంతట గార్గి తన తపస్సులో సగం ఫలం ధారపోస్తాననీ, చరిత్రలో చరితార్ధుడిగా, గార్గి భర్తగా శాశ్వతంగా నిలిచిపోతావనీ చెప్పి ఒప్పించింది. గార్గి, శృంగవంతుల వివాహం జరిగింది. మాట ప్రకారం ఒక్కరోజు కాపురం గడపి భర్తని వదిలిపెట్టడానికి సంసిధ్ధమయింది. అంతట శృంగవంతుడు, గార్గీ, ఇది తగదు. ఆలోచించు. మరి కొంతకాలం నాతో జీవించు. ఇదే నా కోరిక అని దీనంగా ప్రార్ధించాడు. కాని ఆమె ఒప్పుకోలేదు. గార్గి మగనిని వదిలి సన్యాసిని అయంది. ధ్యానంతో ముక్తి పొందింది.
బృహదారణ్యక ఉపనిషత్తులలో శాశ్వత స్ధానం సంపాదించుకున్న బ్రహ్మవాదినులలో గార్గి ఒకామె. వ్యాకరణ శాస్త్రంలో కూడా పాణిని గార్గిని ఉదాహరించాడు. ఆత్మ స్ధైర్యంతో, మనోబలంతో, యుక్తి యుక్త వాదనలతో, ఎలాంటి వారినైనా ప్రశ్నించగలిగిన వనితామణులలో గార్గి ప్రధమ గణ్యం. చరిత్రలోనే వాగ్మిగా, విదుషీమణిగా, స్ధిరచిత్తగా నిలచిన మహోన్నత వ్యక్తి గార్గి.
ఆసక్తికరంగాను, ఙ్ఞాన ప్రబోధితంగాను ఉంది రచన…మంచి విషయాలు చెప్పారు…అభినందనలు.