రచన – కొంపెల్ల రామకృష్ణమూర్తి.
“శ్రీవాణీ గిరిజాశ్చిరాయ” యనుచున్ శ్రీకారముం జుట్టి -వా
గ్దేవీ మంజుల కచ్ఛపీరవళి కాంధ్రీకంఠ మాధుర్యమున్
నీవే కూర్పక యుండిపోయిన మహాంధీభూత హృద్రంగమై
యేవో గాలుల తేలిపోయెడిది కాదే తెల్గు ముమ్మాటికిన్.
“దేశ్యమనగ నొక్క దివ్యప్రవాహము
కదలుచుండు నద్ది కాలము వలె ”
అనుచు నాడె పలికి యాగామి సాహిత్య
రీతి దలచినావు ఋషి సముడవు !
స్వస్థాన వేషభాషలయందు తులలేని
రక్తి కల్గించు సూత్రము ఘటించి,
పామర వ్యవహార భాషా మహాంభోధి
లో నున్న రత్నాలు సానబట్టి,
తత్సమ,దేశ్య,తద్భవ శబ్దములకెల్ల
అక్షర రమ్యతనందజేసి ,
గీర్వాణవాణి కంకితమైన వ్యాసర్షి
కవితాత్మ నాంధ్రలోకమున నిలిపి,
భారతాఖ్యము భవ్య సౌభాగ్యమొకటి
తరతరాలుగ జాతికి దక్కునట్లు
చేసినాడవు “తెల్గు ప్రాచేతసుడవు ”
శత నమస్సులు నన్నయాచార్య! నీకు.
మూర్తిగారూ!
ఆదికవి నన్నయ గురించి చాలా చక్కని పద్యాలు అందించారండీ! ధన్యవాదములు.